యాదాద్రి, నవంబర్ 2: యాదగిరిగుట్ట ప్రధానాలయంలో సువర్ణమూర్తులకు అర్చకులు బంగారు పుష్పాలతో అర్చనలు నిర్వహించారు. బుధవారం స్వయంభూ ఆలయ ముఖ మండపంలో రోజంగా పలు దఫాలుగా భక్తులు సువర్ణ పుష్పార్చన జరిపించారు. బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన చేశారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేశారు.
మండపంలో నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. నిత్యపూజలు అత్యంత వైభవంగా సాగాయి. కార్తిక మాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రతా లు, కార్తిక దీపారాధనలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 12 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఖజానాకు రూ.20,84,165 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.