యాదాద్రి, ఆగస్టు 28 : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవురోజు కావడంతో స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరుమాడ వీధుల్లో భక్తుల సందడి కనిపించింది. స్వామివారి వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ధర్మ దర్శనానికి 3గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
కొండకింద పాతగోశాల వద్ద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. స్వామి వారిని దాదాపు 40 వేల మంది భక్తులు దర్శించుకోగా, అన్ని విభాగాలు కలుపుకొని ఖజానాకు రూ.42,85,155 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు.