యాదాద్రి, అక్టోబర్ 15: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవను అత్యంత వైభవంగా జరిపారు. శనివారం సాయంత్రం ఆలయ మాడవీధుల్లో కల్యాణమూర్తి అయిన లక్ష్మీనారసింహుడిని దివ్య మనోహరంగా అలంకరించి స్వామివారిని గరుడ వాహనంపై, లక్ష్మీ అమ్మవారికి తిరుచ్చి వాహనంపై వేంచేపు చేశారు. పశ్చిమ సప్తతల రాజగోపురం గుండా తిరుమాడ వీధుల్లో స్వామి, అమ్మవార్ల సేవను ఊరేగించి, తూర్పు రాజగోపురం గుండా ప్రధానాలయంలోకి సేవ సాగింది. అనంతరం మంత్రపుష్పంతోపాటు స్వామివారి దర్బార్ సేవ నిర్వహించారు. సుదర్శననారసింహ హోమం, సువర్ణపుష్పార్చన, నిత్య తిరుకల్యాణోత్సవం, సువర్ణపుష్పార్చన కైంకర్యాలను వైభవంగా నిర్వహించారు. 17 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఖజానాకు రూ. 20,79,075 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.