Yadadri | యాదగిరిగుట్ట, ఏప్రిల్ 25: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, అనుబంధ ఆలయాలైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, జనగామ జిల్లా దబ్బగుంటపల్లి యోగానంద నరసింహస్వామి ఆలయాల్లో మే 2 నుంచి 4 వరకు స్వామివారి జయంత్యుత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మే 2న ఉదయం 9:30 గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేన పూజ, పూణ్యాహవాచనం, రుత్విగ్వరణం, కుంకుమార్చనతో జయంత్యుత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
జయంత్యుత్సవాల సందర్భంగా యాదగిరిగుట్ట స్వయంభూ ప్రధానాలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో మే 2 నుంచి 4వరకు ఆర్జిత పూజలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత తిరుకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు చెప్పారు. మూడ్రోజులపాటు సాగే జయంత్యుత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.