యాదాద్రి, ఫిబ్రవరి 20: అద్భుత నిర్మాణాలతో యాదాద్రి ప్రధానాలయం స్వర్గాన్ని తలపిస్తున్నదని, సీఎం కేసీఆర్ యజ్ఞంలా క్షేత్రాన్ని అభివృద్ధి పరిచారని ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్ కొనియాడారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని ఆదివారం ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయంలో అష్టోత్తర పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం యాదాద్రి నూతన ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. చాలా రోజుల తరువాత యాదాద్రికి వచ్చానని, తిరుపతి తరహాలో ఇక్కడ అభివృద్ధి జరుగడం సంతోషంగా ఉన్నదన్నారు. కృష్ణశిలతో అద్భుతమైన కట్టడాలతో యాదాద్రిని పునర్నిర్మించారని ప్రశంసించారు.