భువనగిరి కలెక్టరేట్, జూన్ 27 : స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా భవనగిరి మండలం వడపర్తిలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడపర్తికి చెందిన సేవర్తి శ్రీనివాస్కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మోక్షిత్ గ్రామంలోని శ్రీరామానుజ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. శనివారం మోక్షిత్ పాఠశాల నుంచి స్కూల్ బస్సులో ఇంటికి రాగా.. తల్లి బస్సు వద్దకు వెళ్లింది.
అన్నను చూసిన తమ్ముడు రెండున్నరేండ్ల నిషాంత్ తల్లి వెంట బస్సు వద్దకు వచ్చాడు. డ్రైవర్ బస్సును స్టార్ట్ చేసి ముందుకు కదులుతుండగా ప్రమాదవశాత్తు నిషాంత్ బస్సు వెనుక చక్రాల కింద పడి మృతిచెందాడు. బాలుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్హెచ్వో అనిల్కుమార్ తెలిపారు. డ్రైవర్ నిరక్ష్యంతోనే తన కుమారుడు మృతిచెందాడని శ్రీనివాస్ ఆరోపించారు.