యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 14 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు నిర్వహించనున్నట్టు ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణారావు తెలిపారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తితో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వేడుకకు దేవస్థానం నుంచి రూ.1.50 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ నెల 21న స్వస్తివాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, 27న ఎదుర్కోలు, 28న స్వామివారి తిరుకల్యాణోత్సవం, మార్చి ఒకటిన దివ్య విమాన రథోత్సవం, 2న మహాపూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం, 3న శతఘటాభిషేకంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నట్టు ఆయన పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు అలంకార సేవలు నిర్వహిస్తామని తెలిపారు.
100 మంది పారాయణీకులు, రుత్వికులు, ఆచార్యులు, పండితులు పాల్గొంటారని అన్నారు. ఈ సారి స్వామివారి కల్యాణోత్సవాన్ని కొండపైన తిరుమాడవీధుల్లో నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 28న జరిగే స్వామివారి తిరు కల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరు కానున్నట్టు ఆయన తెలిపారు. స్వామివారి కల్యాణం చేయించుకునే భక్తులకు రూ.3 వేల టికెట్ నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. 23న ఉదయం 9 గంటలకు మత్స్య అలంకారంతో ప్రారంభమయ్యే అలంకార సేవలు మార్చి ఒకటో తేదీ ఉదయం 9 గంటలకు మహావిష్ణు అలంకారంలో గరుడ వాహన సేవతో ముగుస్తాయని ఇన్చార్జి ఈవో తెలిపారు. కొండపైన గల విష్ణు పుష్కరిణిలో చక్రతీర్థ స్నానం నిర్వహించనున్నట్టు చెప్పారు.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహహోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నట్టు ఇన్చార్జి ఈవో రామకృష్ణ తెలిపారు. భక్తులతో నిర్వహించే అర్చనలు, బాలభోగాలు నిలిపివేస్తున్నట్టు చెప్పారు. 27 నుంచి మార్చి 1 వరకు అభిషేకం, అర్చనలు రద్దు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.