హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పూర్తిగా అవాస్తవాలు, తప్పుడు లెక్కలతో శ్వేతపత్రం పేరుతో ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని అగౌరవపరిచింది. సభా గౌరవాన్ని దెబ్బతీసిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి(Y. Satish Reddy )ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడంపై ఆయన స్పందించారు. దేశానికి మార్గదర్శిగా ఉన్న తెలంగాణ గౌరవాన్ని తగ్గించి, రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని దెబ్బతీసింది. కాంగ్రెస్ విడుదల చేసింది శ్వేతపత్రం కాదు సోది పత్రం.
గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలన్న అక్కసుతో, దుర్భుద్దితో తప్పుడు లెక్కలను అసెంబ్లీ ముందు పెట్టి రాష్ట్ర పరువును తీసిందని మండిపడ్డారు. తప్పుడు లెక్కలున్నాయని స్వయంగా సీఎం, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అంగీకరించడమే దీనికి నిదర్శనం. అలాంటప్పుడు ఇది శ్వేతపత్రం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
శ్వేతపత్రం అంటే ఉన్న సదభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గంగలో కలిపేసింది. భవిష్యత్ లో శ్వేతపత్రం అంటేనే ఓ చెత్తపేపర్ అనేలా కాంగ్రెస్ చేసిందని మండిపడ్డారు. అసెంబ్లీలో ఇలాంటి తప్పుడు లెక్కలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రజలకు అదే సభవేదికగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.