Y Satish Reddy | హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఖైరతాబాద్లోని టీఎస్ రెడ్కో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి చైర్మన్ వై సతీష్ రెడ్డి, జీఎం ప్రసాద్,, ఇతర అధికారులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ వై సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తిని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అంటూ దొరలు, పెత్తందారులకు వ్యతిరేకంగా.. పేదల పక్షాన ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు. పేదలందరి కోసం దొడ్డి కొమురయ్య, అతని సోదరుడు దొడ్డి మల్లయ్య ముందుండి నడిచారన్నారు. ఈ క్రమంలోనే ఆనాటి భూస్వాముల కాల్పుల్లో ఆయన అమరుడయ్యారన్నారు. ఆ తర్వాత ఉద్యమం మరింత ఉధృతమై.. పెత్తందారుల చేతుల్లోంచి ప్రజలకు విముక్తి కలిగందన్నారు. ఆ తర్వాత భూ సంస్కరణలు రావడానికి కూడా దొడ్డి కొమురయ్య పోరాటమే నాంది పలికిందన్నారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారన్నారు. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రెడ్కో సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.