హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ-టీజీఎస్ఆర్టీసీకి (TGSRTC) నాలుగేండ్లపాటు సేవలందించడం తనకెంతో ఆనందంగా ఉందని, ప్రజలకు నేరుగా సేవలదించే సంస్థను వీటడం ఒకింత బాధగా ఉన్నదని.. ఆర్టీసీ స్టీరింగ్ వదిలేసే సమయం వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం వీడ్కోలు సభలో ఆయన మాట్లాడారు. తనకు సహకరించిన సిబ్బందికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తన హయాంలో కొత్త బస్సుల కొనుగోలు, యూపీఐ పేమెంట్లు, ఎలక్ట్రిక్ బస్సులు, స్టేషన్ల ఆధునీకరణ, మెగా హెల్త్ క్యాంపులు వంటి కొత్త కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే పీఆర్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. సంస్థ మనుగడ కోసం ఉద్యోగులు శ్రమించాలని సూచించారు.
అనంతరం సజ్జనార్ను ఉద్యోగులు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకన్న, సీటీఎం (కమర్షియల్) శ్రీధర్, సీపీఎం ఉషాదేవి, ఇతర ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆర్ఎంలు, డీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. వీడ్కోలు అనంతరం సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలోనూ భావోద్వేగంతో పోస్ట్ పెట్టారు. ‘నా స్టాప్ వచ్చేసింది. ఆర్టీసీకి 4 సంవత్సరాలకు పైగా మార్గదర్శకత్వం వహించిన తర్వాత, ఈ బస్సు నుంచి దిగి, కొత్త మార్గంలో పయనించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రయాణాలు ఆగుతాయి, ప్రయాణికులు ముందుకు కదులుతారు, కానీ రహదారి ఎల్లప్పుడూ ముందుకే సాగుతుంది. బస్సును పార్ చేసి, తదుపరి సవాలు వైపు ప్రయాణం వేగవంతం చేయాల్సిన సమయం ఇది’ అని పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం సజ్జనార్ లక్డీకపూర్లోని టెలిఫోన్ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్డులోని బస్ భవన్కు బస్సులో ప్రయాణించారు. దారి పొడవునా ప్రయాణికులతో ముచ్చటించారు. డ్రైవర్, కండక్టర్తో ఆత్మీయంగా మాట్లాడారు.
నూతన ఎండీగా వై నాగిరెడ్డి బాధ్యతలు
సజ్జనార్ వీడ్కోలు ముగిసిన తర్వాత సోమవారం మధ్యాహ్నం ఆర్టీసీ ఎండీగా వై నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ సంస్థ ఒడిదొడుకులు, ప్రధాన సమస్యలను నాగిరెడ్డికి వివరించారు. వివరాలు తెలుసుకున్న తర్వాత నాగిరెడ్డి.. ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. సిబ్బంది సహకారంతో సంస్థను లాభాల బాట పట్టిస్తానని తెలిపారు. సిబ్బంది, ప్రయాణికుల నుంచి సలహాలు స్వీకరించి.. ఆర్టీసీ అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజలకు మెరుగైన రవాణా అందించడమే కర్తవ్యమని ల్లడించారు.