Wrestling Competition | అయిజ (జోగులాంబ గద్వాల) : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల గ్రామంలో మీరా సాహెబ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా జాతీయస్థాయి కుస్తీ (మల్ల యుద్ధం) పోటీలు నిర్వహించారు. పోటీల్లో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి 32 మంది మల్ల యోధులు పాల్గొన్నారు. కుస్తీ దంగల్ హోరా హోరీగా సాగాయి.
దక్షిణ తెలంగాణలోని నడిగడ్డ ప్రాంతంలో మొదటిసారి మారుమూల ప్రాంతమైన తుపత్రాల లో కుస్తీ పోటీలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కుస్తీ దంగల్ వీక్షించడానికి అశేష సంఖ్యలో తరలివచ్చారు. ఈ దంగల్లో హైదరాబాద్ కు చెందిన సైఫ్ మొదటి విజేతగా నిలిచాడు. రెండో విజేతగా మహారాష్ట్రకు చెందిన ప్రదీప్ షిండే, మూడో విజేతగా ముస్తఫా, నాల్గో విజేతగా రామ్ సేతి నిలిచారు. విజేతలను ఉర్సు కమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించి, నగదు అందజేశారు.