హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ)/ములుగు: పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రే అత్యంత కీలకమని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా శనివారం సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలోని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టుల్లో తీసుకుంటున్న సంరక్షణ చర్యల వల్ల పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. రానున్న రోజుల్లో పులుల ఆవాసాలను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. మనం పులులను కాపాడితే, అవి అడవిని, తద్వారా ప్రజలను కాపాడుతాయని వివరించారు. ప్రస్తుతం దేశంలో 3,167 పులులు ఉన్నాయని వెల్లడించారు. పులుల ఆవాసాల్లో అలజడిని తగ్గించేందుకు కోర్ ఏరియాల్లో ఉన్న గ్రామాల తరలింపు ప్రక్రియను చేపట్టామని తెలిపారు.
అటవీ ప్రభావిత గ్రామాల పరిసరాల్లో మనుషులపై జంతువులు దాడులు చేయకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ స్థాయిలకు చెందిన 400 మంది పాల్గొన్నారు. అనంతరం టైగర్ థీమ్గా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులు, ఉద్యోగులకు బహుమతులను అందించారు. తర్వాత ఎమ్మెస్సీ (వైల్డ్ లైఫ్) నూతన కోర్స్ బ్రోచర్ను ఆవిషరించారు. ఈ కార్యక్రమంలో అమ్రాబాద్, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్లు వినోద్కుమార్, క్షితిజ, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీకి చెందిన ఇమ్రాన్ సిద్దికీ, పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, అడిషనల్ పీసీసీఎఫ్ (ఐటీ) వినయ్కుమార్, సీసీఎఫ్ రామలింగం, హైదరాబాద్ సీసీఎఫ్ సైదులు, ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ ఆశ, ఫారెస్ట్ కాలేజీ అధికారులు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, నర్సింహారెడ్డి, తదితరులు హాజరయ్యారు.