హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): అడవిబిడ్డల అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ సర్కారు ముందుకు సాగుతున్నది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దేశంలో మరే రాష్ట్రం ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తున్నది. దశాబ్దాలుగా ‘మావ నాటే మావ రాజ్..’ మా తండాలో మా పాలన’ అంటూ నినదించిన ఆదివాసీ, గిరిజన బిడ్డల దశాబ్దాల కల నెరవేర్చింది. గిరిజన గురుకుల విద్యాలయాలు, తిర్యాణి వంటి అడవుల నుంచి పోలెండ్ వంటి దేశాలకు ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లేందుకు టీఆర్ఎస్ సర్కార్ కొత్త బాటలు పర్చింది. ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
సంస్కృతి ప్రతీకలు మ్యూజియాలు
సంస్కృతి ప్రతీకలుగా ఆరు మ్యూజియాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని నెహ్రూ గిరిజన మ్యూజియాన్ని వంద శాతం గిరిజన సంస్కృతితో ప్రభుత్వం పునరుద్ధరించింది. భద్రాచలంలోని కోయ, కొండరెడ్డి మ్యూజియం, మన్ననూర్లో చెంచులక్ష్మి, కెరమెరి జోడేఘాట్లో కుమ్రంభీం, మేడారంలో సమ్మక -సారలమ్మ మ్యూజియం, ఖానాపూర్ మండలం అశోక్నగర్ (పాకాల దగ్గర) కోయ మ్యూజియాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నడిబొడ్డున ఆదివాసీ, బంజారా భవనాలు నిర్మించింది. గోండుపోరాట యోధుడు రాంజీగోండు పేరిట రూ.15 కోట్లతో స్మారక మ్యూజియం నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఆదివాసీగూడెలు, గిరిజన తండాలను టీఆర్ఎస్ సర్కార్ గ్రామ పంచాయతీలుగా మార్చింది. తద్వారా 3,146 గ్రామ పంచాయతీల్లో ఆదివాసీ, గిరిజన బిడ్డలకు పాలకులుగా అవకాశం కల్పించింది. ఆదివాసీ, గిరిజన గ్రామ పంచాయతీల సొంత భవనాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.25 లక్షల చొప్పున కేటాయించింది. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.1000 కోట్లను కేటాయించింది.
గిరిబ్రాండ్తో ఉపాధికి ప్రోత్సాహం
తెలంగాణ సర్కారు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా గిరిజనుల ఉపాధికి ఇతోధికంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. జీసీసీతో ఊట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏల పరిధిలో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటుచేసి వారికి శిక్షణ ప్రత్యేక శిక్షణ ఇచ్చి గిరిబ్రాండ్ పేరుతో అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించింది. జీసీసీ ఇప్పటికే 18 పెట్రోల్ బంక్లు నిర్వహిస్తున్నది.
మరో 19 కొత్త బంక్లను ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. గురుకుల విద్యాలయ సంస్థ గిరిపుత్రులను అక్షరయోధులుగా తీర్చిదిద్దుతున్నది. గిరిజనుల కోసం 22 డిగ్రీ కాలేజీల (ఇందులో 15 మహిళలవే)ను నెలకొల్పింది. రూ.221 కోట్ల అంచనా వ్యయంతో 3,467 గిరిజన ఆవాసాలకు త్రీఫేజ్ కరెంట్ అందిస్తున్నది. రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో) 12 మారుమూల చెంచు ఆవాసాల్లో 211 గృహాలకు సోలార్ పవర్ ప్యాక్లు అందించింది. ఆదివాసీ బిడ్డలు సర్కారీ కొలువులు సాధించేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో 33 జిల్లాలు-48 శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ ఇస్తున్నది.
దేశమే అబ్బురపడేలా..
చిన్నారులు, మహిళల ఆరోగ్య పరిరక్షణ, ఎదుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారానికి దేశమే అబ్బురపడింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న ‘మిషన్ సంపూర్ణ పోషణ్’కు ఈ ఏడాది ప్రధానమంత్రి అవార్డు లభించటం విశేషం. వెయ్యి ఎకరాల్లో జవారీ, బాజ్రా, సామలు, కొర్రలు, అరికెలు, వరిగెలు వంటి చిరుధాన్యాలను జిల్లాలోని జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, కెరమెరి మండలాల్లోని దాదాపు 2,500 మంది రైతులు 1000 ఎకరాల్లో సాగుచేసేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. పోషణ్ అభియాన్ వల్ల గిరిజన ప్రాంతాల్లో మాతృమరణాలు గణనీయంగా తగ్గాయి. రక్తహీనతకు లోనైన మరణాల రేటు 18 నుంచి జీరోకు చేరింది.
రాష్ట్రంలో ఆదివాసీ బంధువు పాలన
రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజన బంధువు పాలన కొనసాగుతున్నది. దేశంలో 16 కోట్ల గిరిజన జనాభా ఉంటే కేంద్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే.. 38 లక్షల జనాభా ఉన్న తెలంగాణలో రూ.16,655 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ది. గ్రామ పంచాయతీల పక్కా భవనాల నిర్మాణం కోసం బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించారు. ఆదివాసీ, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, విద్యాఅవకాశాల కల్పన మాత్రమే కాకుండా ఉద్యోగార్థులకు శిక్షణ ఇస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ ఒక్కటే.
-సత్యవతి రాథోడ్, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి