హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): వాతావరణ మార్పులకు సంబంధించిన వార్తలను కవర్ చేసేటప్పుడు జర్నలిస్టులు వాస్తవ సమాచారాన్ని గణాంకాలతోపాటు లోతైన విశ్లేషణ, పరిశోధనాత్మక కథనాలను అందించాలని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్, యాక్టింగ్ పబ్లిక్ అఫైర్స్ అధికారి జోనాథన్ ఓర్ సూచించారు. వ్యూస్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి యూఎస్ కాన్సులేట్ తెలుగు జర్నలిస్టులకు రెండు రోజుల వర్క్షాప్ నిర్వహించింది. బుధవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈ వర్క్షాప్ను ప్రారంభిస్తూ జోనాథన్ ప్రసంగించారు. వాతావరణ మార్పులను రిపోర్ట్ చేయటానికి అవసరమైన సాధనాలు, సాంకేతికతను అందించటమే ఈ వర్క్షాప్ లక్ష్యమని చెప్పారు. వ్యూస్ ఇండియా డైరెక్టర్ ఎస్ భీమ్రావ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో యూఎస్ కాన్సులేట్ భాగస్వామి కావటం సంతోషంగా ఉన్నదన్నారు. వాతావరణ వార్తల కవరేజీని పెంచటానికి మీడియా సంస్థలకు ఇలాంటి వర్క్షాప్లు సహాయపడతాయని చెప్పారు. ఈ సదస్సులో ఈపీటీఆర్ఐ డైరెక్టర్ వాణీప్రసాద్, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.