Medigadda | హైదరాబాద్, మే17 (నమస్తే తెలంగాణ): వర్షాకాలంలో మేడిగడ్డ బరాజ్ వద్ద చేపట్టాల్సిన రక్షణచర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ చేసిన మధ్యంతర సిఫారసులకు సంబంధించిన పనులను ఎల్అండ్టీ సంస్థ ప్రారంభించింది. బరాజ్లోని బ్లాక్-7లో 8 గేట్లను ఎత్తివేసేందుకు చర్యలు చేపట్టింది. వరద ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలని, అందుకు గేట్లను పూర్తిగా తెరచి ఉంచాలని, ఆటంకంగా మారిన ఇసుకమేటలు, రాళ్లను తొలగించాలని ఎన్డీఎస్ఏ కమిటీ సూచించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన పనులను చేట్టాలని బరాజ్ నిర్మాణ ఏజెన్సీకి ఇరిగేషన్శాఖ ఇటీవలనే ఆదేశాలను జారీ చేసింది.
ఈ నేపథ్యంలో సదరు ఏజెన్సీ మొత్తం 8 గేట్లలో ఇప్పటికే ఒక గేటును ఎత్తి పెట్టింది. మరో 2 మినహా మిగతా గేట్లను సైతం సాంకేతిక ఇబ్బందులు లేకుండానే ఎత్తే అవకాశముందని ఎల్అండ్టీ అధికారులు వెల్లడిస్తున్నారు. పగుళ్లు ఏర్పడిన 20వ పిల్లర్, దానిపక్కన ఉన్న పిల్లర్ గేట్లను ఎత్తడంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడుతున్నది. బరాజ్కు దిగువన, ఎగువన పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగిస్తున్నది. రాఫ్ట్ కింద ఉన్న రంధ్రాలను ఇసుక, సిమెంట్తో గ్రౌటింగ్ చేసేందుకు, షీట్ పైల్స్ను వేసేందుకు సైతం సంసిద్ధమైంది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల రక్షణకు చేపట్టాల్సిన సత్వర పనులపై ఇరిగేషన్శాఖ ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ (ఓఅండ్ఎం), సీఈ (సీడీవో), రామగుండం సీఈతో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటయిన జ్యుడీషియరీ కమిషన్కు ఇప్పటివరకు 3 ఫిర్యాదులు మాత్రమే అందాయి. ప్రాజెక్టుపై సలహాలు, సూచనలు, ఫిర్యాదులను స్వీకరించేందుకు కమిషన్ ప్రత్యేకంగా బాక్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 31 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఫిర్యాదులు చేసేవారెవరైనా సరే సాక్ష్యాలతో అఫిడవిట్ను దాఖలు చేయాల్సి ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది. దీంతో ఫిర్యాదులు ఎక్కువగా రాలేదని తెలిసింది. కాగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ జూన్ 6న రాష్ర్టానికి రానున్నారని సమాచారం.
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను గడువులోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. పనుల నిర్వహణలో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లపై ఇప్పటికే ప్రత్యేకంగా కమిటీని వేయగా నివేదికను సైతం సమర్పించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఎస్ఎల్బీసీ పనుల ప్రారంభంపై ఇరిగేషన్ సెక్రటరీ శుక్రవారం నిర్మాణ ఏజెన్సీలు, ఇంజినీర్ అధికారులతో చర్చించారు.