CS Shati Kumari | పర్యావరణానికి ముప్పుగా మారిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ను స్వచ్ఛందంగా నిషేధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో వర్క్షాప్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రాజీశ్ శర్మతో పాటు సచివాలయంలోని వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై ఇప్పటికే ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్లాస్టిక్ నిషేధాన్ని సచివాలయ స్థాయిలో స్వచ్ఛందంగా పాటిస్తూ ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్లో కేవలం 9శాతం మాత్రమే రీ సైక్లింగ్ జరుగుతోందని, మిగిలిన ప్లాస్టీక్ వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీ జలాల్లో కలుస్తూ జీవనానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలతో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై పౌరులను చైతన్య పరుస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిగ్రామంలో చెత్త నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేస్తున్నట్లు వివరించారు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వులతో సాధ్యం కాదని.. స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలన్నారు. కాలుష్య నివారణ మండలి చైర్మన్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యక్తిగంతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్లాటిక్ నిషేధంపై ఇప్పటికే జిల్లాస్థాయిలో కమిటీలున్నాయన్నారు. ప్రజా చైతన్య కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో చేపట్టాలని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో వినియోగించే ప్రత్యామ్నాయ వస్తువులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను సీఎస్ శాంతికుమారి ప్రారంభించగా.. ఈ వర్క్షాప్కు హాజరైన కార్యదర్శులు, ఉన్నతాధికారులు సందర్శించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి భూమిని కాపాడుకొందాం అనే నినాదంతో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు.