జనగామ : జిల్లాలోని పాలకుర్తి మండలం వల్మిడి (వాల్మీకి పురం) లో సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన, దేవాలయ పున: ప్రారంభ కార్యక్రమాలు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, పలువురు ప్రజాప్రతినిధులు సమక్షంలో చిన్న జీయర్ స్వామి మంగళ శాసనములతో సోమవారం వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్య వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. పాలకుర్తి, బమ్మెరతో పాటు వల్మిడి దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పారు. రెండు గుట్టల మధ్య రోప్ వే రామానుజన్ విగ్రహం, వాల్మీకి విగ్రహం ఏర్పాటు, వేద పాఠశాల వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. సీఎం కేసీఆర్ హిందూత్వ వాది, మంత్రి ఎర్రబెల్లి భక్తి పరుడు, అందుకే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటకపరంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. దేవాలయాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్వ వైభవం దక్కుతున్నదని వారు వివరించారు.
వల్మీడి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ట తరువాత నేరుగా మంత్రులు పాలకుర్తి మండల కేంద్రానికి చేరుకొని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా పాల్కురికి సోమనాథుడు స్మృతి వనం, కళ్యాణ మండపం, హరిత హోటల్, గిరిజన భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కాగా, ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు.