తాండూర్, ఏప్రిల్ 13 : మంచిర్యాల జిల్లా తాండూర్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్కు చుక్కెదురైంది. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే వినోద్ ఏడుగురికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాండూరుకు చెందిన మంచెర్ల పోచమల్లు, కిష్టంపేట గ్రామానికి చెందిన శాలిగామ పద్మ ఎమ్మెల్యే వినోద్ దగ్గరికి వచ్చారు. కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం ఇస్తానన్న తులం బంగారం ఏమైంది, మహాలక్ష్మి పథకం ద్వారా అందిస్తామన్న రూ. 2,500 ఏమయ్యాయని ఎమ్మెల్యేను నిలదీశారు.
దీంతో మహిళల ప్రశ్నలను దాటవేస్తూ ఎమ్మెల్యే అకడి నుంచి వెళ్లిపోయారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆ మహిళల దగ్గరికి వచ్చి.. ‘మిమ్మల్ని ఎవరు పంపించారు. బీఆర్ఎస్ వాళ్లు పంపించారా’ అంటూ గద్దిస్తూ మాట్లాడటంతో పాటు, మీ పథకాలను రద్దు చేస్తామంటూ బెదిరించారు. అయినప్పటికీ మహిళలు జంకకుండా ఎన్నికలప్పుడు దొంగ హామీలు ఇవ్వడమే కాకుండా.. డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కొని.. అధికారంలోకి రాగానే మా ప్రాణం తీస్తున్నారని మండిపడ్డారు. పెండ్లి జరిగినప్పుడు ఇచ్చే కల్యాణలక్ష్మి డబ్బులు.. పిల్లలు పుట్టాక కూడా రావడం లేదంటూ అసహనం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారం చూసిన స్థానికులు ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని, గుసగుసలాడుకోవడం కనిపించింది.