మహబూబ్నగర్, జూన్ 30 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): హరితహారంలో పాలుపంచుకునేందుకు పాలమూరు మళ్లీ సిద్ధమైంది. విత్తన బంతులతో పచ్చదనాన్ని పెంచే యజ్ఞంలో స్వచ్ఛందంగా పాల్గొన్నది. గతేడాది 1.18 కోట్ల విత్తన బంతులను తయారుచేసి ప్రపంచ రికార్డు సాధించింది. తాజాగా పదిరోజుల్లో రెండు కోట్ల విత్తన బంతులను తయారుచేసి గత రికార్డును తిరగరాసింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారైన విత్తన బంతులను అడవులు, కొండకోనలు, మనుషులు చేరుకోలేని ప్రదేశాల్లో వెదజల్లేందుకు హెలికాప్టర్, డ్రోన్లను జిల్లా యంత్రాంగం సిద్ధంచేస్తున్నది. సెర్ప్ ఆధ్వర్యంలో 1.70 కోట్లు, మెప్మా ద్వారా 30 లక్షల సీడ్ బాల్స్ సిద్ధంచేశారు. ఈ నెల 15 నుంచి 10 రోజులపాటు విత్తన మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 2.8 కోట్ల విత్తన బంతులను తయారుచేశారు. ఇందుకోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్ట లేదు. అటవీశాఖ విత్తనాలను సేకరించింది. విత్తన బంతులు తయారీకి అవసరమైన ఎరువు, మట్టిని గ్రామ పంచాయతీలు సిద్ధంచేశాయి. ఒక్క రూపాయి కూడా కూలి తీసుకోకుండా జిల్లాలోని లక్ష మంది మహిళలు రెండు కోట్ల 8 లక్షల విత్తన బంతులు సిద్ధంచేశారు. ఈ క్రతువులో మహిళా సంఘాలే కీలక పాత్ర పోషించాయి. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 1.70 కోట్ల విత్తన బంతులు, మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూరు పరిధిలోని మెప్మా ద్వారా 30 లక్షల విత్తన బంతులు తయారుచేయాలని లక్ష్యం నిర్దేశించుకొని 8 లక్షలు ఎక్కువగానే తయారుచేశారు. సుమారు 8 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు అటవీ ప్రాంతంలో విత్తన బంతులను చల్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విత్తన బంతుల తయారీలో పాలుపంచుకున్న మహిళలందరికీ జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. రెండు కోట్ల విత్తన బంతులను వెదజల్లడంపై జిల్లా మహిళా సమాఖ్య గిన్నిస్ రికార్డు కోసం దరఖాస్తు చేసినట్టు సమాచారం. ‘మహిళలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి హరితహారం విజయవంతానికి ప్రయత్నించడం కంటే గొప్ప కార్యక్రమం ఏముంటుంది’ అని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పేర్కొన్నారు. ‘స్వయం సహాయ సంఘాల మహిళలంతా ఏకతాటిపై నిలిచి పైసా తీసుకోకుండా 2.8 కోట్ల విత్తన బంతులు తయారుచేయడం మాములు విషయం కాదు’ అని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఏపీడీ శారద తెలిపారు.