మేడ్చల్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ‘మన ముందుతరం భారత స్వాతంత్య్రం కోసం కొట్లాడింది.. మా తరం తెలంగాణ కోసం పోరాడాం.. ఇప్పుడు మీ తరం 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడండి’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విద్యార్థినులకు కర్తవ్య బోధ చేశారు. మహిళలు సమైక్యంగా, సమన్వయం గా ఉంటే హక్కులను సాధించుకోవచ్చని తెలిపారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ ఉమెన్స్ డే వేడుకల్లో ఆమె రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మహిళలు సాఫ్ట్వేర్లాగా ప్రతిరోజూ అప్డేట్ కావాలని సూచించారు.
దేశంలో మార్పుకోసం ఇంజినీరింగ్ చేసిన విద్యార్థినులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. విద్యా, ఉద్యోగం పనిగంటల్లో సమానత్వం సాధించుకొనేలా మహిళలు ఉద్యమించాల్సిన అవసరముందని తెలిపారు. రాష్ట్రంలో ఇంజినీర్లకు తెలంగాణ సర్కారు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నదని, టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్తో ఉన్నచోటే ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నదని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా తెలంగాణ సర్కారు అన్ని అవకాశాలు కల్పిస్తున్నదని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మహిళలు శక్తివంతులని, వారు తలచుకొంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పారు. కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్లు మహేందర్రెడ్డి, షాలినిరెడ్డి, ప్రీతిరెడ్డి, ప్రవీణ్రెడ్డి, యూనివర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి, ప్రిన్సిపాల్ మాధవీలత పాల్గొన్నారు.