హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): మహిళా రైతులు ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులు పండించాలని వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ, రాష్ట్ర వ్యవసాయశాఖ, కోరమాండల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన రెండ్రోజుల మెగా మహిళా రైతు మేళా సోమవారం ముగిసింది. ఈ మేళాకు సుమారు 11వేల మంది మహిళా రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్దాస్ జానయ్య మాట్లాడుతూ.. అధిక రసాయనాలతో సాగు చేయడం వల్ల నేల, గాలి, నీటి నాణ్యతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. మేళాను ఘనంగా నిర్వహించిన పీజేటీఏయూ సురేంద్రమోహన్ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి, సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్, విత్తనోభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవానీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.