పదకొండేండ్ల తర్వాత మహిళ ఆచూకీ లభ్యం
మారుతీనగర్, ఆగస్టు 24: మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రమా దంలో చనిపోయిందనుకున్న మహిళ.. పదకొండేండ్ల తర్వాత తిరిగొచ్చిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గాసాగర్లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన రెంజర్ల నర్సయ్య, లక్ష్మి దంప తులది నిరుపేద కుటుంబం. జీవనోపాధి కోసం నర్సయ్య దుబాయ్ వెళ్లగా.. భార్య లక్ష్మి ముగ్గురు కూతుర్లతో గ్రామంలోనే ఉండేది. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన లక్ష్మి మతిస్థిమితం కోల్పోయింది. 2010లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనా పూర్ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని లక్ష్మిదిగా భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా చేశారు. 2013లో దుబాయ్ నుంచి వచ్చిన నర్స య్య మరో వివాహం చేసుకున్నాడు. ఐదురోజుల క్రితం మెట్పల్లి ఠాణా నుంచి నర్స య్యకు ఫోన్ వచ్చింది. ‘నీ భార్య లక్ష్మి తమిళనాడు రాష్ట్రం పెరంబూర్ జిల్లాలోని కరు ణమలై ట్రస్ట్లో ఉన్నారు’ అని చెప్పగా ఉద్వేగానికి లోనయ్యాడు. కూతుర్లతో కలిసి నర్సయ్య తమిళనాడు వెళ్లగా.. భర్త, పిల్లలను లక్ష్మి గుర్తించింది. మంగళవారం లక్ష్మి స్వగ్రామానికి చేరుకోగా.. కూతుర్లు, బంధువులు ఆనందంలో మునిగిపోయారు.