Miss World 2025 | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో నిర్వాహకుల కారణంగా తనకు తాను ఒక వేశ్యలా భావించాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేసిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ.. అంతకుముందు తీవ్ర మనోవేదనకు గురైనట్టు తెలుస్తున్నది. చౌమహల్లా ప్యాలెస్లో జరిగిన ప్రభుత్వ విందులో కొందరు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడం, నిర్వాహకులు దీనిని పట్టించుకోకపోవడం ఆమెను తీవ్ర మనస్థాపానికి గురిచేసినట్టు సమాచారం. అయితే మ్యాగీ ఒక్కరే కాకుండా పోటీదారులందరూ బాధితులేనని తాజాగా వెల్లడైంది. విందుకొచ్చిన అతిథుల్లో కొందరు పోటీదారులనుద్దేశించి ‘మీరు బోరింగ్గా ఉన్నారు.. మమ్మల్ని ఖుషీ చేయడం లేదు’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తనకు జరిగిన అవమానాన్ని మిల్లా మ్యాగీ తన సహచర కంటెస్టెంట్లతో చెప్పుకోగా వారు కూడా తాము అదే పరిస్థితిని ఎదుర్కొన్నామని గోడు వెళ్లబోసుకున్నట్టు సమాచారం. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన మ్యాగీ ఈ విషయాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లిందని, ఆ మేరకు ఫిర్యాదు కూడా చేసిందని తెలిసింది. అయితే ఇలాంటి ఈవెంట్లో ఇవన్నీ సహజమేనని, నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడమే కాకుండా ఆమె ఆరోపణలను కొట్టిపారేసినట్టు సమాచారం. ఇక చేసేదిలేక నిస్సహాయస్థితిలో ఆమె పోటీనుంచి తప్పుకొని ఇంగ్లండ్ వెళ్లిపోయింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఓ అంతర్జాతీయ అందాల పోటీలో పాల్గొనే అవకాశం దక్కించుకున్న ఆయా దేశాల కంటెస్టెంట్లు తమకు జరిగిన అవమానాలతో తప్పుకోవడం ఇష్టంలేక బలవంతంగా కొనసాగినట్టు తెలుస్తున్నది.
చౌమహల్లా ప్యాలెస్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందే మిల్లా మ్యాగీ పోటీ నుంచి తప్పుకొనేలా చేసింది. సుమారు 300మంది పాల్గొన్న ఆ విందులో అతిథులను అలరించడానికి వారితో ఫొటోలు దిగాలని, డ్యాన్స్లు చేయాలని, క్యాట్వాక్ చేయాలని నిర్వాహకులు పోటీదారులకు సూచించినట్టు తెలిసింది. ఇదే ఆమెను అసౌకర్యానికి గురిచేసింది. ఆమెకు ఇష్టంలేకపోయినా అతిథుల్లోని కొందరు బడాబాబులు బలవంతంగా స్టెప్పులు వేయించే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తీవ్ర అసహనానికి గురైన మ్యాగీ అక్కడి నుంచి ట్రైడెంట్ హోటల్కు చేరుకొని ఆ రాత్రి, మ రుసటి రెండు రోజులు భయంభయంగా గడిపినట్టు తెలిసింది.
మిస్వరల్డ్ పోటీల తీరును బట్టబయ లు చేసిన మిల్లా మ్యాగీపై నిర్వాహకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆమె కావాలనే పోటీ నుంచి తప్పుకుని ఆరోపణలు చేస్తున్నదని కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. కానీ ఆమె సామాజిక వ్యవహారాలను పరిశీలించిన కొందరు మ్యాగీ ఎంతో నిబద్ధతగల వ్యక్తి అని కొనియాడుతున్నారు. సాధారణంగా అందాల పోటీలు అంటే సన్నగా, నాజుగ్గా ఉండాలి. కానీ కొలతలతో పనేంటి అంటూ ప్లస్ సైజ్తో ఉన్న ఆమె ధైర్యంగా ముందుకొచ్చి మిస్ ఇంగ్లండ్ టైటిల్ దక్కించుకున్నారు. ప్లస్సైజ్తో మిస్ ఇంగ్లండ్ టైటిల్ గెలుచుకున్న మొదటి యువతి కూడా ఆమెనే. మిల్లా మ్యాగీ సామాజిక దృక్పథం ఉన్న యువతి. గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆ మరణాలను సీపీఆర్తో తగ్గించే అవకాశం ఉందని ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. తనకు లభించిన ప్రతి వేదికపై ఆమె సీపీఆర్ ప్రాధాన్యత.. ఆస్కిల్తో ఇతరుల ప్రాణాలు ఎలా కాపాడవచ్చో వివరిస్తున్నది. అందులో భాగంగా ఆమె ‘గో ఫార్ విత్ సీపీఆర్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. పాఠశాల స్థాయి నుంచే సీపీఆర్పై సిలబస్ ఉండాలని ప్రచారం చేస్తున్నది.
మిస్ ఇంగ్లండ్ ఆరోపణలపై ప్రభుత్వం కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ 109 మంది కంటెస్టెంట్లను, నిర్వాహకులను ప్రశ్నించినట్టు చెప్తున్నారు. కానీ ఆ కమిటీ నివేదికను ప్రభుత్వం బయటకు చెప్పడం లేదు. చౌమహల్లా ప్యాలెస్, ట్రైడెంట్ హోటల్లో జరిగిన కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల సీసీటీజీ పుటేజీని పరిశీలిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని నిపుణులు సూచిస్తున్నా రు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చిన మిస్ ఇంగ్లండ్ వేధింపుల ఘటనపై సాధ్యమైనంత త్వరగా నివేదిక బయటపెట్టాల్సింది పోయి ఆ దిశగా కమిటీ అడుగులు వేయకపోవడం అనుమానాలను కలిగిస్తున్నది.