హైదరాబాద్: ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లడం మెజారిటీ విద్యార్థుల కల. ఈ విదేశీ విద్య కలను సాకారం చేసుకోవడంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందంజలో ఉంటున్నారు. గత ఏడాది భారత్ నుంచి అమెరికాకు రికార్డు స్థాయిలో 82,500 ఎఫ్1 (విద్యార్థి) వీసాలు వస్తే, అందులో అత్యధికులు అమ్మాయిలే కావడం విశేషం..! టీ హబ్ సహకారంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఫారిన్ స్టడీస్ (ఐఎంఎఫ్ఎస్) నిర్వహించిన ‘గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023’ కార్యక్రమంలో పలువురు వక్తలు ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు.
విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లాలనుకునే విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ తదితర దేశాలకు చెందిన 100కి పైగా విదేశీ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. టీఎస్సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు, టీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది వి పట్టాభి హాజరయ్యారు.
ఐఎంఎఫ్ఎస్ హైదరాబాద్ విభాగం భాగస్వామి అజయ్కుమార్ వేములపాటి మాట్లాడుతూ.. ‘గత ఆరేడేళ్లుగా మన దేశం నుంచి విదేశీ విద్యకు వెళ్లే అమ్మాయిల సంఖ్య బాగా పెరుగుతోందన్నారు. తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరి ఆలోచనా తీరులో వస్తున్న మార్పే ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు. ఇంతకుముందు ఆడపిల్లలను ఏదో ఒక డిగ్రీ చదివించి, పెళ్లిచేసి పంపేస్తే సరిపోతుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలాలేదు. అమ్మాయిలైనా బాగా చదువుకుని, కొన్నాళ్లు ఉద్యోగం చేసి, తమ కాళ్ల మీద నిలబడగలిగిన తర్వాతే పెళ్లి అంటున్నారు. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా విదేశాలకు వెళ్లే అమ్మాయిల సంఖ్య బాగా పెరుగుతోంది. సంపన్న కుటుంబాల్లో తల్లిదండ్రులు అమ్మాయిలను విదేశాలకు పంపడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. మధ్య, ఎగువ మధ్య తరగతి కుటుంబాల వారు కూడా బ్యాంకులు రుణాలు ఇస్తుండటంతో విదేశీవిద్యకు పంపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలు పెద్ద సంఖ్యలో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తుండటం మంచి పరిణామం’ అన్నారు.
అమెరికాలో అధ్యక్షులు ఎవరున్నారు..? వారి విధానాలేంటి అన్నదాన్ని బట్టి భారతీయులు అక్కడికి వెళ్లడం ఆధారపడుతుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా ఫస్ట్ అనే విధానం అవలంబించడంతో భారతీయులు అక్కడికి వెళ్లేందుకు వెనుకాడారు. ఆ తర్వాత కొన్నాళ్లు కొవిడ్ మహమ్మారి విజృంభించింది. దాంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. 2021 ప్రారంభంలో జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత నుంచి మళ్లీ విదేశీ విద్యార్థుల చూపు అమెరికా మీద పడింది. 2022లో ఇప్పటివరకు అత్యధికంగా భారత్ నుంచి 82,500కుపైగా విద్యార్థి వీసాలను అమెరికన్ రాయబార కార్యాలయాలు జారీచేశాయి. వీటిలో సింహభాగం అమ్మాయిలవేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’’ అని అజయ్కుమార్ వెల్లడించారు.