హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సులో నిండు గర్భిణీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆర్టీసీ సిబ్బంది సకాలంలో స్థానిక దవాఖానకు చేర్చడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఉట్నూర్ డిపోకు చెందిన పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ఉట్నూర్ నుంచి ఉదయం 10.30 గంటలకు మహారాష్ట్రలోని చంద్రాపూర్కు బయలుదేరింది. మార్గమధ్యంలో ఉన్న ఇంద్రవెల్లి స్టాప్ వద్ద మహారాష్ట్రకు చెందిన నిండు గర్భిణీ మడావి రత్నమాల బస్సు ఎక్కింది. గుడిహత్నూర్ మండలం మన్కాపూర్ వద్దకు రాగానే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. బస్సు కండక్టర్, డైవర్.. తల్లీబిడ్డను స్థానిక దవాఖానకు తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ విషయం తెలుసుకొన్న ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్ చైర్మన్, ఎండీ వీసీ సజ్జనార్, ఆదిలాబాద్ డీవీఎం మధుసూదన్, డీఎం విజయ్ బస్సు డ్రైవర్ ఎం అంజన్న, కండక్టర్ సీహెచ్ గబ్బర్సింగ్ను ప్రత్యేకంగా అభినందించారు.