వినాయకనగర్, మే 12: నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్కు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ఓ మహిళ ఆయనను సూటిగా ప్రశ్నించింది. ఎంపీకి ఫోన్ చేసిన ఆమె.. బండి కుమారుడు చేసిన పని త ప్పని ఎందుకు చెప్పడం లేదని నిలదీసింది. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్కాల్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎంపీ అర్వింద్కు ఫోన్ చేసిన ఓ మహిళ తనను తాను పరిచయం చేసుకుంది. తన పేరు అనిత అని, హైదరాబాద్లో ప్రై వేట్ ఉద్యోగిని అని చెబుతూ.. బండి కుమారుడి వ్యవహారం గురించి ప్రశ్నించింది. సూటిగా సమాధానం చెప్పలేని అర్వింద్.. తాను ఖండించే చోట, ఖండించాలనుకుంటే ఖండిస్తానని అర్వింద్ బదులిచ్చారు.
తాను బీజేపీ ఎంపీని అని, పార్టీలో అడిగినప్పుడు చెబుతానని సమాధానం ఇచ్చారు. ‘హైదరాబాద్లో కోటి మంది ఉంటారు.. అందులో మీరెవరు. మీరేం చేస్తారని’ ఎంపీ ప్రశ్నించగా.. తాను ఓ ప్రైవేట్ ఉద్యోగినని బదులివ్వగా, ఏ కంపెనీలో పని చేస్తారు, ఎక్కడ చేస్తారని ప్రశ్నలు వేశారు. తాను రహమత్నగర్లో ఉంటానని చెప్పిన మహి ళ.. అసలు నేను అడిగిన దానికి, మీరు అడిగే దానికి సంబంధం ఉందా సార్? అంటూ ఎంపీని ప్రశ్నించింది. ‘నన్ను అడగటానికి మీరెవరు’ అంటూ ఎంపీ ఆమెను ఎదురు ప్రశ్నించగా, మీరు ప్రజల మనిషి కాబట్టి అడుగుతున్నామంటూ జవాబు ఇచ్చింది.
‘నేను ఎక్కడ మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడకూడదని చెప్పడానికి మీరెవరు? అయినా నేను ఖండించానా.. ఖండించలేదా అనే విషయం మీకు తెలుసా? మీరు ఎక్కడ చూశారని’ అర్వింద్ అడిగారు. నేను సోషల్మీడియా, టీవీ చూస్తుంటాను సార్ నాకు తెలుసని ఆమె సమాధానమిచ్చింది. సమాధానం చెప్పలేకపోయిన అర్వింద్.. ‘ఇలాంటి ఫోన్లు నాకు చాలా వస్తాయి అనిత గారు. మీరు నా కు నేర్పించాల్సిన అవసరం లేదని’ ఎదురు తిరిగా రు. ‘మీకంటే ఎక్కువ బాధ్యత మాకు మహిళల పట్ల ఉంది. మీరు చెప్పాల్సిన అవసరం లేదు’ అన్నారు. జరిగిన తప్పును తప్పు అని మీరు ఎందుకు ఖండించటం లేదంటూ మహిళ మరోసారి ప్రశ్నించగా, మీకు తెలియకపోతే మేము చేసేదేమి లేదు.. సరేసరే మీ పని బాగా చూసుకోండంటూ ఫోన్ పెట్టేశారు.