బయ్యారం: నడుముకు రాయి కట్టుకుని వ్యవసాయ బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పలపాడుకు చెందిన బిచ్చాకు రాజేందర్, సుఖ్యా ఇద్దరు కుమారులు.. బుజ్జి అనే కూతురు ఉన్నది. ఇటీవల బిచ్చా తన పేరిట కొంత పొలం ఉంచుకుని, మిగతా భూమిని కుమారులకు పంచాడు.
పొత్తుల వ్యవసాయ బావి నీటితోనే ముగ్గురూ పంటలు సాగు చేస్తున్నారు. రాజేందర్కు మరోచోట కూడా కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమికి కూడా ఉమ్మడి వ్యవసాయ బావి నుంచే నీళ్లు తీసుకెళ్తానని రాజేందర్ కోరగా.. తండ్రి, సోదరుడు అంగీకరించలేదు. ఈ విషయమై గత రెండు నెలలుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తండ్రీ, సోదరులు తరచూ గొడవలు పడుతుండటంతో మనస్తాపం చెందిన రాజేందర్ కుమార్తె మేఘన (16) గత నెల 28న అదే వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
దాంతో ఇల్లు వాస్తుకు లేదని భావించిన రాజేందర్ తన భూమిలో కొత్త ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించాడు. మంగళవారం ఇల్లు పని చేయిస్తుండగా.. రాజేందర్ చెల్లెలు భర్త అక్కడికి వచ్చి గొడవకు దిగాడు. ఇద్దరూ కొట్లాడుకుని ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. రాజేందర్, ఆయన భార్య జ్యోతి (43) తిరిగి ఇంటికి వెళ్లారు. అయితే, అప్పటికే బిడ్డ చనిపోయిన ఆవేదనలో ఉన్న జ్యోతి తాజా వివాదంతో మరింత మనస్తాపానికి గురైంది.
ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని పొలంలోని అదే వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అయితే, తనకు ఈత వచ్చు కాబట్టి బావిలో మునుగనన్న ఆలోచనతో నడుముకు రాయి కట్టుకుని బావిలో దూకింది. కుటుంబంలో భూ వివాదం కారణంగా తల్లీబిడ్డలు ఒకే బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.