మెదక్: మెదక్ జిల్లాలోని (Medak) రామాయంపేటలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని కాట్రియాలలో మంత్రాల నెపంతో ఓ మహిళను సజీవదహనం చేశారు. గురువారం రాత్రి ద్యాగాల ముత్తవ్వ అనే మహిళ తన ఇంట్లో ఉండగా గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు. మంత్రాలు చేస్తున్నదని పెట్రోల్ పోసి నిప్పంటించారు. అరుపులు విన్న స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితురాలిని దవాఖానకు తరలించారు.
అయితే మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్లోని హాస్పిటల్కు తరలిస్తుండగా మృతిచెందింది. దీంతో మృతదేహాన్ని పోలీసులు రామాయంపేట దవాఖానకు తీసుకెళ్లారు. దాడి భయంతో మృతురాలి కుమారుడు, కోడలు పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.