హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మరో 7,005 మంది ఇమామ్లు, మౌజంలకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇచ్చేందుకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అసెంబ్లీలో ప్రకటించిన 24 గంటల్లోనే ఉత్తర్వులు ఇచ్చారు. ‘రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 10 వేలమంది మౌజంలు, ఇమామ్లకు గౌరవ వేతనం ఇస్తున్నాం. మరో 7వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అందరికీ రేపు సాయంత్రంలోగా ఉత్తర్వులు ఇచ్చేస్తాం. పూజారులకు ఏ విధంగా ఇస్తున్నామో.. మౌజంలు, ఇమామ్లకు కూడా అలానే ఇద్దాం’ అని సీఎం కేసీఆర్ ఆదివారమే అసెంబ్లీలో పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోమవారమే మరో 7,005 మంది మౌజంలు, ఇమామ్లకు గౌరవ వేతనమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 9,995 మంది ఇమామ్లు, మౌజంలకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. కొత్తగా జతచేసిన వారితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా గౌరవ వేతనం పొందే ఇమామ్లు, మౌజంల సంఖ్య 17 వేలకు చేరింది.