KCR : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు బ్రహ్మాండంగా పంటలను సాగుచేసుకున్నారని, కానీ అనతికాలంలోనే ఇంతర దుర్భర పరిస్థితి వస్తదని అనుకోలేదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ మండలాల్లో పర్యటించిన అనంతరం సూర్యాపేటలో ప్రెస్మీట్ నిర్వహించిన ఆయన.. రైతుల దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని అన్నారు.
‘2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో ఏటా 30, 40 లక్షల టన్నుల ధాన్యం కూడా ఉత్పత్తి అయ్యేది కాదు. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి ఏకంగా 3 కోట్ల టన్నులు దాటింది. ప్రభుత్వం రైతు సంక్షేమ విధానాలతో ఉత్పత్తి అధికమై పంజాబ్కే పోటీగా నిలిచింది. అంతేకాదు అనతికాలంలోనే దేశంలోనే అగ్రస్థానానికి దూసుకుపోయింది. ఇది కట్టుకథ కాదు, పిట్టకథ కాదు, వాస్తవం. మరి ఇంత సుభిక్షంగా ఉన్న రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు ఇంత అధ్వాన్నంగా మారడానికి కారణం ఎవరు..? లోపం ఎక్కడున్నది..? ఈ విషయంపై ప్రజలతోపాటు జర్నలిస్టు మిత్రులు కూడా బాగా ఆలోచన చేయాలి’ అని కేసీఆర్ సూచించారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత తొందరగా కేవలం 100 రోజులలోపే రైతులకు ఇంత దుర్భర పరిస్థితి వస్తదని అనుకోలే. కేవలం 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. మేం రైతులకు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టినా ఈ దుస్థితి ఎందుకొచ్చింది..? దేశంలోనే ఉత్పత్తిలో నంబర్ వన్ స్థాయికి ఎదిగిన రాష్ట్రం అనతికాలంలో ఈ స్థాయికి ఎందుకు దిగజారింది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇంటికో నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన రాష్ట్రంలో తాగునీటికి కరువు ఎందుకొచ్చినట్టు..? మా టైమ్లో బ్రహ్మాండంగా తాగునీటి సరఫరా జరిగింది. ఎక్కడా నీళ్ల ట్యాంకర్లు కనపడలే. ఏ ఆడ బిడ్డ కూడా వీధుల్లో బింద పట్టుకుని కనపడలే. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసే దుస్థితి ఎందుకొచ్చింది..?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.