హైదరాబాద్, మే22 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లోకి యువత, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తులు రావాలని, మోసగాళ్లు, స్వార్థపరులు, అవినీతి పరులు వస్తే మొత్తం సమాజమే నష్టపోతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. విద్యావంతుడు, సమాజసేవకుడు, బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన మిత్రుడు ఏనుగుల రాకేశ్రెడ్డిని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని ఎక్స్ ఖాతా వేదికగా బుధవారం ఆయన విజ్ఞప్తి చేశారు. రైతుకుటుంబంలో పుట్టి, బిట్స్ పిలానీలో గోల్డ్మెడల్ సాధించి అమెరికా అవకాశం వదులుకొని సమాజం కోసమే రాకేశ్రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. వరంగల్లో వరదలు వచ్చిన సమయంలో ప్రజలకు బాసటగా నిలిచారని, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. పట్టభద్రులు మొదటి ప్రాధాన్యతగా ఏనుగుల రాకేశ్రెడ్డికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.