ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 31: మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా తగిన గుణపాఠం చెప్తామని వివిధ విద్యార్థి సంఘాల దళిత నాయకులు హెచ్చరించారు. ఇటీవల మోత్కుపల్లిపై వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ జేఏసీ, మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఫ్లెక్సీకి చెప్పుల దండవేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. దళితజాతి ముద్దుబిడ్డ మోత్కుపల్లి మచ్చలేని నికార్సైన నాయకుడని కొనియాడారు. రేవంత్కు దమ్ముంటే నర్సింహులు సంధించిన ప్రశ్నలకు జవాబివ్వాలని డిమాండ్ చేశారు. దళితులను కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్కు దళిత, గిరిజన సభలు నిర్వహించే అర్హత లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో విద్యార్థినేతలు గణేశ్, మహేశ్, బోరెల్లి సురేశ్, నరేశ్, రామకృష్ణ, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.