హైదరాబాద్,/ఉస్మానియా యూనివర్సిటీ డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ బీఈడీ కాలేజీ వద్ద ఉన్న మెట్ల బావిని పునరుద్ధరించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీ బీఈడీ కాలేజీ వద్ద ఉన్న మెట్ల బావిని పునరుద్ధరించాలని కోరుతూ విద్యార్థి నజీర్ మంత్రి కేటీఆర్ను ట్విట్టర్లో అభ్యర్థించారు.
ఈ మెట్ల బావికి చారిత్రక నేపథ్యం ఉన్నదని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ మెట్ల బావిని పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ను ఆదేశించారు. ఓయూ వీసీతో సమన్వయం చేసుకోవాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. దాంతో మెట్ల బావి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకొన్న అర్వింద్కుమార్ ఫొటోలను ట్యాగ్ చేస్తూ పునరుద్ధరణ పనులు హెచ్ఎండీఏ చేపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా సమస్యను ప్రస్తావిస్తే వెంటనే పరిష్కరించిన మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
బౌద్ధ స్థూపం పూర్వవైభవానికి చర్యలు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధస్థూపం పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు. 1,600 ఏండ్ల చరిత్ర ఉన్న బౌద్ధస్థూపం రూపం కోల్పోయి ఉండటంపై పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని మంత్రి కేటీఆర్ను ట్విట్టర్ ద్వారా కోరారు. ఈ వినతిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ బౌద్ధ స్థూపాన్ని పునరుద్ధరించాలని జిల్లా మంత్రి అజయ్ కుమార్కు సూచించారు.