హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) మంగళవారం నిర్వహించిన ప్రచార సభ అట్టర్ఫ్లాప్ అయిందనే చర్చ జోరుగా జరుగుతున్నది. ఈ సభకు నియోజకవర్గంలోని మైనార్టీల నుంచి మద్దతు కరువైంది. దీంతో సీఎం రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ (Congress) అధిష్ఠానంలో కలవరం మొదలైంది. మైనార్టీల మద్దతు లేకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గట్టెక్కడం ఎలా అన్న ప్రశ్న వారిని తొలచివేసింది. దీంతో రాత్రికి రాత్రి సీఎం రేవంత్రెడ్డి.. మైనార్టీలను ఏ విధంగా మచ్చిక చేసుకోవాలనే అంశంపై అధిష్ఠానం పెద్దలతో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. అధిష్టానం ఆదేశాలతో తెల్లారేసరికి స్థానిక నేత అజారుద్దీన్కు (Azharuddin) మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు పార్టీ, ప్రభుత్వ పెద్దలు మీడియాకు లీకులు ఇచ్చారు. అజారుద్దీన్ శుక్రవారం మంత్రిగా ప్రమాణం చేస్తారన్నది లీకుల ఉద్దేశం. అజారుద్దీన్కు మంత్రి ఇవ్వడం ద్వారా నియోజకవర్గంలోని మైనార్టీలను మచ్చిక చేసుకొని వారి ఓట్లకు గాలం వేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు కాంగ్రెస్లో చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్లో సీనియర్ నేతగా పేరున్న అజారుద్దీన్ ఇటీవలి కాలంలో పార్టీలో ఘోర అవమానాలను ఎదుర్కొన్నట్టు చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్రెడ్డి ఆయనను దూరం పెట్టడంతోపాటు జూబ్లీహిల్స్తో ఆయనకు సంబంధం లేకుండా చేశారనే విమర్శలున్నాయి. ఉప ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకుండా అవమానించిన కీలక నేతలు ఆ తర్వాత ప్రచారంలోనూ ఆయనను అవవమానించినట్టు తెలిసింది. అందుకే ఉప ఎన్నికల ప్రచారంలో అజారుద్దీన్ ఎక్కడా కనిపించలేదు. ఆయన లేకుండానే మంత్రులు ప్రచారం చేస్తున్నారు.అజార్కు జరుగుతున్న అవమానాలపై ఆయన వర్గంతోపాటు నియోజకవర్గంలోని మైనార్టీల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదనే చర్చ జరుగుతున్నది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్.. ఆ తర్వాత కూడా నియోజకవర్గాన్ని వీడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మళ్లీ టికెట్ ఇవ్వాలని ఆజారుద్దీన్ చేసిన విజ్ఞప్తిని ఎవరూ పట్టించుకోలేదని తెలిసింది.
ఈ ఉప ఎన్నికలో అజార్కు టికెట్ ఇచ్చేందుకు ఓ కీలక నేత అడ్డం పడినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో అజారుద్దీన్ నేరుగా ఢిల్లీ నుంచి తన ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఆయనకు జూబ్లీహిల్స్ టికెట్కు బదులుగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఆ తర్వాత ఆగస్టులో జరిగిన క్యాబినెట్ సమావేశంలోనూ ఆయన పేరును ప్రతిపాదించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అజార్ తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలిసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికపై బీఆర్ఎస్ దాఖలు చేసిన కేసులో.. నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ను ఎంపిక చేసింది. తనకు అమలుకాని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మోసం చేశారనే ఆవేదనతో అజారుద్దీన్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారు. అజారుద్దీన్కు జరిగిన అవమానంపై స్థానిక మైనార్టీల్లోనూ వ్యతిరేకత నెలకొన్నట్టు సమాచారం.
అనివార్య పరిస్థితుల్లోనే కాంగ్రెస్ అధిష్ఠానం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కూడా కాని అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఇది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందా అన్న వ్యాఖ్యలు పార్టీల్లో వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే రాజ్యాంగం ప్రకారం ఆరు నెలలలోపు ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో ఎన్నికవ్వాలి. గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా ప్రకటించినప్పటికీ ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అది ఎప్పటికి తేలుతుందో తెలియదు. ఒకవేళ ఆరు నెలలలోపు తీర్పు రాకుండా, ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవి ఊడుతుంది. ఈ విధంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను బలిచేస్తుందా అన్న చర్చ కూడా జరుగుతున్నది. ఇదంతా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం కొత్త డ్రామాకు తీశారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్నిక పూర్తయ్యాక.. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా మంత్రి పదవి నుంచి దింపేస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల మంది ఓటర్లు ఉండగా ఇందులో లక్ష ఓటర్లు మైనార్టీలే. వారి మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా గెలవడం కష్టమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే మైనార్టీలు కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నారని గ్రహించిన పార్టీ పెద్దలు వారిని శాంతింప చేయడానికి అజారుద్దీన్కు ఏకంగా మంత్రి పదవి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతున్నది.