ఖమ్మం, జూన్ 27(నమస్తే తెలంగాణ, ప్రతినిధి): దళిత మహిళ మరియమ్మ కస్టోడియల్ మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ ఎం మహేందర్రెడ్డి తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్న రాష్ట్రంలో ఇటువంటి ఘటన దురదృష్టకరమని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతామన్నారు. ఆదివారం ఖమ్మం వచ్చిన ఆయన ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడు ఉదయ్కిరణ్ను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఐజీ నాగిరెడ్డి, సీపీ విష్ణు ఎస్ వారియర్తో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. మరియమ్మ మృతిపై అన్ని కోణాలో విచారణ జరుగుతుందన్నారు. ప్రజల ఆత్మగౌరవం, వారి ప్రాణాలకు ఇబ్బంది కలిగించేలా పోలీసులు వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరియమ్మ మృతిపై స్పందించిన ప్రభుత్వం ఆమె కుటుంబానికి అన్ని విధాలా సహాయం చేస్తున్నదని తెలిపారు.