దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్రెడ్డి హామీ
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న వంశపారంపర్య అర్చకుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర దేవదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్రెడ్డి హామీ ఇచ్చారు. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమ సంధానకర్త రంగరాజన్, యాదగిరి గుట్టకు చెందిన కారంపూడి నరసింహాచార్యులు, తెలంగాణ ఇనామ్దార్ అర్చకుల సమాఖ్యకు చెందిన పవన్కుమార్, తదితరులతో కూడిన వారసత్వ అర్చకుల ప్రతినిధి బృందం మంత్రిని శుక్రవారం కలిసింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందచేశారు. ఏపీలో వంశపారంపర్య అర్చకుల కోసం పెండింగ్లో ఉండిన సర్వీసు రూల్స్ ఇప్పటికే అంటే 2019 అక్టోబర్ 21 నుంచి అమలు చేస్తున్నారని తెలిపారు. వంశపారంపర్య అర్చకులు, పూజారుల హక్కులను గుర్తించడం, తెలంగాణ రాష్ట్రంలో జీవో 439ని అమలు చేయడం ద్వారా, ఆయా దేవాలయాలలో అర్చకసేవలకు ఇచ్చిన ఇనాం భూములను కాపాడి, వంశపారంపర్య అర్చకులను బలోపేతం చేయాలని కోరారు.