మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
తొర్రూరు, ఆగస్టు 6: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకాలన్న సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగాన్ని ఆయిల్పామ్ సాగులో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతానని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆయిల్ ఫెడ్, లయన్స్ ఆఫ్ తొర్రూరు ఆధ్వర్యంలో ఆయిల్పామ్ సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. తొర్రూరు మండలంలోని గుర్తూరు వద్ద ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్పామ్ సాగు చేస్తానని ప్రకటించి రైతుల్లో ఉత్తేజం నింపారు. ఆయిల్పామ్ సాగుకు ముందు కొచ్చే రైతులకు ఎకరానికి రూ.1.20 లక్షల రుణం, మూడేండ్లపాటు రూ.32 వేల సబ్సిడీతోపాటు డ్రిప్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మొక్క నాటిన మూడేండ్ల వరకు కాపాడుకుంటే 30 ఏళ్లపాటు దిగుబడి ఇస్తుందని, ఎకరాకు లక్షకు తగ్గకుండా ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో హరిపిరాలలో 26 ఎకరాల్లో నర్సరీని ఏర్పాటు చేస్తున్నామని, గోపాలగిరిలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు స్థలసేకరణ పూర్తిచేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచెర్ల రామకృష్ణారెడ్డి, కలెక్టర్ అభిలాషా అభినవ్ తదితరులు పాల్గొన్నారు.