Amrabad Forest | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): అమ్రాబాద్ ఫారెస్ట్ రిజర్వ్ (ఏటీఆర్) అటవీ ప్రాంతాల్లో తాగునీటి కోసం వన్యప్రాణులు తండ్లాడుతున్నాయి. దంచికొడుతున్న ఎండలకు తోడు అడవిలో ఎగిసిపడుతున్న మంటలు, తగ్గిన భూగర్భజలాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. నిరుడు అంతంతమాత్రంగా కురిసిన వర్షాలు, ప్రస్తుతం పెరిగిన ఉష్ణోగ్రతలతో అడవుల్లోని నీటి వనరులు ఎండిపోతున్నాయి. దాహార్తిని తీర్చుకునేందుకు గ్రామాలకు వస్తున్న వన్యప్రాణులు ప్రజలపై దాడికి పాల్పడి గాయపర్చడమే కాకుండా వేటగాళ్ల ఉచ్చులో చిక్కి మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో వన్యప్రాణుల తాగునీటి సౌకర్యాల కల్పనకు అటవీశాఖ అధికారులు రూ.78 లక్షల నిధులు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. రెండేండ్లుగా కంపా నిధులు రాకపోవడంతో ఉన్న నిధులతో వారు నెట్టుకొస్తున్నారు. టూరిజం ఫండ్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నా, పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం కావడం లేదు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) 2611.4 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. నేషనల్ టైగర్ కన్జర్వేటర్ (ఎన్టీసీఏ) అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం 32 పులులు, 176 చిరుత పులులు, 250 ఎలుగుబంట్లు, 10 వేలకు పైగా ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. వీటితోపాటు వివిధ రకాల పక్షులు, సరీసృపాలు, కీటకాలు, ఆయుర్వేద మొక్కలు, అరుదైన వృక్షసంపద ఉన్నది. కృష్ణా నది సరిహద్దులో ఉండటంతో ఏటీఆర్లోకి ఇతర ప్రాంతాల నుంచి పక్షులు, జంతువులు వలస వస్తుంటాయి. ప్రతి ఏటా వన్యప్రాణుల సంతతి గణనీయంగా అభివృద్ధి చెందుతున్నది. నీటి సమస్యతో వలసొచ్చే వన్యప్రాణులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు.
అడవిలో తరచూ ఎగిసిపడే మంటలతో వన్యప్రాణులు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. ఈ దశలో పరిగెత్తే సమయంలో గాయాలపాలవడంతో వాటిని మృత్యువు కబలిస్తున్నది. కొత్త ఆవాసాల్లో నీటి వనరులు దొరకక చనిపోతున్నాయి. అడవిలో నీళ్లు లేక గ్రామాల్లోకి, సమీప పంట పొలాల్లోకి రావడంతో వేటగాళ్లు వాటిని చంపుతున్నారు. అలాగే పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు కరెంట్ వైర్లు పెట్టడం, ఉచ్చులు బిగించడంతో వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల ఐసీఐసీఐ ఫౌండేషన్ 5 ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకులు అందించింది. వీటి ద్వారా కొన్ని రేంజ్ల పరిధిలో నీటి సరఫరా చేస్తున్నారు.
అడవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తు న్నాం. సహజ నీటి వనరుల వద్ద సోలార్ పంప్సెట్స్ ఏర్పాటు చేశాం. సాసర్ పిట్స్ మరమ్మతులు చేయాలని ఎఫ్ఆర్వోలకు సూచనలు ఇచ్చాం. టూరిజం ఫండ్స్తో ఏర్పాట్లు చేస్తున్నాం. వేటగాళ్ల నియంత్రణపై దృష్టి పెట్టాం. వేటాడితే కఠినంగా వ్యవహరిస్తాం. వన్యప్రాణులు దాడి చేస్తే నష్టపరిహారం అందిస్తున్నాం.