సుబేదారి, ఏప్రిల్ 10: ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్విమ్మింగ్ పూల్లో తల్లి, ఇద్దరు కూతుళ్లు హత్యకు గురైన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం హనుమకొండ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ మీడియాకు వెల్లడించారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామానికి చెందిన ఎండీ అజారుద్దీన్, ఫరాహత్ దంపతులకు ఇద్దకు కూతుళ్లు ఉన్నారు. ఫరాహత్ మూడోసారి గర్భం దాల్చడంతో కుటుంబసభ్యులతో కలిసి లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని నిర్ధారణ కావడంతో కొడుకు కావాలనే కోరికతో అజారుద్దీన్ దూరపు బంధువైన ఓ బాలికను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు.
ఈ క్రమంలో ఈనెల ఒకటి న ఐస్క్రీం తినిపిస్తానని అజారుద్దీన్ తన భార్య, పిల్లలను పున్నేలులోని స్విమ్మింగ్పూల్ వద్దకు తీసుకొచ్చాడు. ఫరాహత్, పిల్లలు హుమేరా, ఆయేషాను స్విమ్మింగ్పూల్లో ముంచి హత్యచేశాడు. అనంతరం భార్య, పిల్లలు స్విమ్మింగ్పూల్లో పడి చనిపోయారని ప్రచారంచేశాడు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా, అజారుద్దీన్ వారిని హత్య చేసినట్టు వెల్లడైంది.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు అజారుద్దీన్, కుటుంబసభ్యులు ఎండీ చాంద్పాషా, సలీమా, షర్ఫొద్దీన్, లింగనిర్ధారణకు సహకరించిన బసిక స్రవంతి, బా ల్నే పార్థు, బొమ్మెర మనోహర్, లింగాల నరేశ్, సట్ల రాజు, వాంకుడోత్ భద్రును అరెస్ట్ చేశారు. వైద్యులు బాల్నే పూర్ణిమ, ఎస్ రవళి పరారీలో ఉన్నారు. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని అన్నారు.