బ్యాటింగ్కు వెళ్లేముందు తన ఎడమ కాలికి మొదట ప్యాడ్ కట్టుకోవడం క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సెంటిమెంట్. తన తండ్రి ఇచ్చిన పవిత్ర దారం తనతో పాటు ఉంటేనే బాగా ఆడగలనని క్రికెట్ రారాజు, కింగ్ కోహ్లీ నమ్మకం. జెర్సీపై నంబర్ లేకుండా ఉంటేనే బౌలర్లను చిత్తు చేయగలనని నజాఫ్గఢ్ నవాబ్, విధ్వంసక ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ నమ్ముతాడు. అవే వారికి సెంటిమెంట్లుగా మారాయి. ‘క్రికెట్ మ్యాచ్లో బరిలోకి దిగే మీకేనా?’ ఎన్నికల పోరులో నిలిచే మాకూ కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయంటున్నారు మన నేతలు. తామూ సెంటిమెంట్ ఫాలో అయ్యాకే కదన రంగంలోకి దిగుతామని వారు చెబుతున్నారు.
నామినేషన్ పత్రాలు దాఖలు చేశాకే ఎన్నికల పోరు ఆరంభమవుతుంది. నేతల తలరాతలను డిసైడ్ చేసే నామినేషన్ను సాదాసీదాగా వేస్తే ఎలా? గుడులు.. గోపురాలకు వెళ్లడం.. పూజలు చేయడం.. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం.. ర్యాలీలు.. ఆ తర్వాత నామినేషన్ను దాఖలు చేయడం కామనే. కానీ కొంతమంది నేతలు అందరికీ భిన్నంగా.. అనాదిగా కొన్ని సెంటిమెంట్లను నమ్ముతున్నారు. వాటిని ఫాలో అయ్యాకే తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. అందులో మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు.
‘సబ్కా మాలిక్ ఏక్ హై’ అని నమ్మే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్గౌడ్ నామినేషన్ వేసే ముందు సర్వమత ప్రార్థనలు చేస్తారు. నామినేషన్ ముందురోజు జహంగీర్ పీర్ దర్గాను దర్శించుకొని పూజలు చేస్తారు. నామినేషన్ రోజు మైలార్దేవ్పల్లిలోని దుర్గామాతను దర్శించుకుంటారు. అనంతరం తన స్వగృహంలో సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ సెంటిమెంట్ను పాటించే 2009, 2014, 2018 ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగురవేశారు. తాజా ఎన్నికల్లో ఈనెల 10న నామినేషన్ దాఖలు చేయనున్న ఆయన ఇదే సెంటిమెంట్ను పాటించి మరోసారి అసెంబ్లీలో అడుగుపెడతానని ఘంటాపథంగా చెబుతున్నారు.
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్రెడ్డి హరిహరాదులు ఒక్కరేనని నమ్ముతారు. హరిహరాదుల మధ్య తారతమ్యం లేదని భావించే జనార్దన్రెడ్డి బిజినేపల్లి మండలంలోని వట్టెం శ్రీ వేంకటేశ్వరస్వామివారి చెంత ఒక నామినేషన్ సెట్, నల్లమల అడవుల్లో కొలువైన ఉమామహేశ్వరస్వామి ఆలయంలో మరో సెట్కు పూజలు చేయిస్తారు. అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని కార్యకర్తలతో కలిసి నామినేషన్ను దాఖలు చేయడం ఆనవాయితీగా మార్చుకున్నా రు. ఈ సెంటిమెంట్ను నమ్మే ఆయన 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇదే సెంటిమెంట్తో బుధవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
హుస్నాబాద్లో మొదటి బహిరంగ సభ నిర్వహించిన తర్వాతనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం సీఎం కేసీఆర్కు ఆనవాయితీ. అక్కడ మీటింగ్ అయ్యాకే ఆయన రాష్ట్రమంతా పర్యటిస్తారు. 2014, 2018ల్లో అక్కడి నుంచే సమర శంఖం పూరించారు. ఈ ఏడాది కూడా అక్కడే మొదటి సభ పెట్టారు. అలాగే సిద్దిపేట జిల్లా.. నంగునూరు మండలం.. కోనాయిపల్లిలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శనం చేసుకున్నాకే కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు. రాజకీయం జీవితం ప్రారంభించిన నాటి నుంచే ఆయన ఈ సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు. కోనాయిపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతోనే ఆయన 1985 నుంచి 2018 వరకు సాధారణ, ఉప ఎన్నికలు.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. తాజా ఎన్నికల్లో గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగుతున్న ఆయన ఈనెల 9న రెండుచోట్ల నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఈనెల 4న మంత్రి హరీశ్రావుతో కలిసి కోనాయిపల్లిలోని శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన నామినేషన్లను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామివారి సమక్షంలో నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి తన పాత కారంటే ఎంతో మక్కువ. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ఆయనకు ఆ అంబాసిడర్తో ప్రత్యేక అనుబంధం ఉన్నది. ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు ఆ కారులోనే వెళ్లడం ఆయనకు సెంటిమెంట్గా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అంటే 1984లో తన కూతురు అరుణారెడ్డి పేరిట లక్ష్మి ఆటోఫైనాన్స్ టికెట్ డ్రాలో అంబాసిడర్ కారును గెలుచుకున్నారు. ఆ కారును ఆయన సెంటిమెంట్గా భావించి 7007 నంబర్ తీసుకున్నారు. ఇప్పటివరకు ఏడుసార్లు ఇదే వాహనంలో వెళ్లి నామినేషన్ వేసిన ఆయన ఆరుసార్లు గెలుపొందారు. ఈనెల 4న ఇదే కారులో వెళ్లి నామినేషన్ కూడా వేశారు. తన గెలుపులో అంబాసిడర్ కారు ఓ భాగమైపోయిందని చెబుతున్న స్పీకర్ పోచారం ఈసారి కూడా గెలుపు తనదేననే ధీమాతో ఉన్నారు.
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి 2001లో జడ్పీటీసీగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఓ సెంటిమెంట్ను నమ్ముతున్నారు. అత్తగారి ఊరైన రామాయంపేటలోని కోనాపూర్ ప్రజల సాక్షిగా నామినేషన్ పత్రాలను నింపడం ఆమె సెంటిమెంట్. 2001లో రామాయంపేట జడ్పీటీసీగా గెలుపొందినప్పటి నుంచి ఈ సెంటిమెంట్ను నమ్ముకొని 2004, 2014, 2018ల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజా ఎన్నికల్లోనూ ఈనెల 7న నామినేషన్ దాఖలు చేసిన పద్మాదేవేందర్ రెడ్డి ఇదే ఆనవాయితీని పాటించారు. కోనాపూర్లోని పోచమ్మ, ఏడుపాయల వనదుర్గా మాతను దర్శించుకున్నారు. ఆపై ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి సమక్షంలో మెదక్లో నామినేషన్ను దాఖలు చేశారు.