ఈటలకు ఎమ్మార్పీఎస్ టీఎస్ నేత వంగపల్లి ప్రశ్న
హుజూరాబాద్, సెప్టెంబర్ 5: బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలో ఒక్క కారణమైనా చెప్పాలని, లేదంటే టీఆర్ఎస్కు ఓటెందుకెయ్యాలో తాము వంద కారణాలు చెబుతామని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు సవాల్ విసిరారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు. దళితులను చదువుకు దూరం చేసింది బీజేపీ అని, అలాంటి పార్టీలో చేరిన ఈటలకు దళితుల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. మనువాద పార్టీలో చేరిన ఈటలను ఉప ఎన్నికలో వ్యతిరేకించాలని దళిత, బహుజనులకు పిలుపునిచ్చారు. ఓట్ల కోసం దళిత వాడలకు వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈటల రాజేందర్ ఓట్లు అడగాలంటే బీజేపీకి రాజీనామా చేయాలని వంగపల్లి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ నాయకులు తునికి వసంత్ మాదిగ, ఎల్కపెల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.