హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన కుల రాజకీయ వ్యాఖ్యలను కాంగ్రెస్లోని ఇతర కులాల నాయకులు సమర్థిస్తున్నారా? లేదా? స్పష్టం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతుంటే చూడలేక.. రేవంత్ అధికార దాహంతో కుల రాజకీయాలు తేవాలని ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. ఉమ్మడి రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రుల్లో 12 మంది ఒకే సామాజికవర్గానికి చెందినవారని, అప్పుడు రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై వీహెచ్, భట్టి విక్రమార్క వంటి నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఆ నాయకుల నోళ్లు మూతపడ్డాయా? లేక అమ్ముడు పోయారా? అని నిలదీశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ను కంటికి రెప్పలా కాడుకుంటామని చెప్పారు. రేవంత్రెడ్డి చంద్రబాబు ఏజెంట్గా పనిచేస్తున్నాడనే విషయం త్వరలోనే కాంగ్రెస్ తెలుసుకుంటుందని అన్నారు. పీసీసీ టీడీపీకీ బీ టీమ్గా పనిచేస్తున్నదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ను, మంత్రి కేటీఆర్ను ఏకవచనంతో సంబోధిస్తున్న రేవంత్రెడ్డి భాష మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాజ్యసభ అభ్యర్థిగా హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి ఎంపికపై జగ్గారెడ్డి ఆరోపణలు సరికాదని అన్నారు. కరోనా సమయంలో పార్థసారథిరెడ్డి ఎంతోమందిని ఆదుకొన్నారని చెప్పారు.