సంగారెడ్డి, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ సర్కారు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. రైతులను కొట్టి.. కార్పొరేట్లకు పెట్టు అన్నట్టుగా మోదీ పాలన ఉన్నదని మండిపడ్డారు. ప్రధాని మోదీ పాలన రైతులకు శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో శనివారం మంత్రి హరీశ్రావు పర్యటించారు. రూ.121 కోట్లతో నిర్మించే పాశమైలారం-కర్థనూరు రహదారి పనులకు, రుద్రారంలోని గణేశ్ ఆలయంలో రూ.4.50 కోట్ల అభివృద్ధి పనులకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలోనూ మంత్రి పాల్గొన్నారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ పాలన తలా తోకా లేకుండా సాగుతున్నదని విమర్శించారు. నాలుగేండ్లకు సరిపడా బియ్యం, గోధుమ నిల్వలు ఉన్నాయని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు నూకల ఎగుమతులపై నిషేధం విధించటం, వరి ఎగుమతిపై 20 శాతం సుంకం విధించడం ఏమిటని ప్రశ్నించారు. దేశ ఆహార భద్రతకు భరోసా లేకుండా మోదీ సర్కారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. కేంద్రం తీరుతో దేశ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల విషయంలో కేంద్రానికి ఇప్పటికీ సోయి వస్తలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. రైతుల పెట్టుబడులను మాత్రం రెట్టింపు చేసిందని ఎద్దేవా చేశారు. నూకల ఎగమతులపై నిషేధాన్ని వెంటనే తొలిగించడంతోపాటు వరిపై విధించిన 20 శాతం సుంకాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో కరువు నెలకొన్నదని, ఆయా దేశాల చూపు ధాన్యం అధికంగా పండించే తెలంగాణ వైపు ఉన్నదని తెలిపారు.
త్వరలో సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, పటాన్చెరుకు మంజూరైన 300 పడకల దవాఖాన పనులకు శంకుస్థాపన చేస్తారని, ఈ సందర్భంగా రెండుచోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఒకనాడు కరువు, కాటకాలకు నిలయమైన తెలంగాణను సీఎం కేసీఆర్ ఆకుపచ్చ తెలంగాణగా మార్చారని అన్నారు. దేశంలోనే అతి ఎక్కువ వరి పంట పండించే రాష్ట్రంగా, దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 72 లక్షల ఎకరాల్లో వరి సాగు అయితే, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వానకాలం సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్టు వివరించారు. ఇంకా వరి సాగు విస్తీర్ణం పెరుగుతున్నదని తెలిపారు. ధాన్యం ఎక్కువగా ఉంటే విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కల్పించాలని, తద్వారా రైతులకు లాభం చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీ భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీ సత్యనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.