న్యూయార్క్: 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్(Kandula Sai Varshith).. ఏకంగా వైట్హౌజ్ను స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత అధ్యక్షుడు బైడెన్ను చంపేసి.. దేశాన్ని ఏలాలనుకున్నాడు.. భారీ ట్రక్కుతో శ్వేత సౌధం బారికేడ్లను ఢీకొట్టిన సాయి వర్షిత్పై సీక్రెట్ సర్వీస్ దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కొలంబియా జిల్లా కోర్టులో సీక్రెట్ సర్వీస్ ఈ క్రిమినల్ అఫిడవిట్ను దాఖలు చేసింది.
సెయింట్ లూయిస్ నుంచి సాయి వర్షిత్ వన్వే టికెట్ కొనుకుని డుల్లీస్ ఇంటర్నేషనల్ ఎయిర్కుపోర్టుకు చేరుకున్నాడు. ఆ తర్వాత యూ-హౌల్ ట్రక్కును ఎయిర్పోర్టు వద్ద రెంట్ తీసుకున్నాడు. నేరుగా ఆ ట్రక్కుతో వైట్హౌజ్ను రాత్రి 9.35 నిమిషాలకు ఢీకొట్టనట్లు అఫిడవిట్లో తెలిపారు. వైట్హౌజ్ ముందు ఉన్న లఫాయేతి స్క్వేర్ పార్క్లో ఆ ట్రక్కుతో దూసుకెళ్లాడు. అక్కడ ఉన్న మెటల్ సెక్యూర్టీ బారియర్లను ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్లోకి తీసుకుని మళ్లీ బారియర్లను ఢీకొట్టాడు.
ట్రక్కు నుంచి స్మోక్ రాగానే.. దాని నుంచి సాయి వర్షిత్ కిందకు దిగాడు. ట్రక్కు వెనక్కి వెళ్లి చేతుల్లోకి నాజీ స్వస్తిక్ గుర్తు ఉన్న జెండాను తీసుకున్నాడు. నాజీలు అంటే తనకు ఇష్టమని తెలిపాడు. వాళ్ల చరిత్ర గొప్పదని మెచ్చుకున్నాడు. నాజీల నియంతృత్వ ధోరణికి ఆకర్షితుడైనట్లు చెప్పాడు. ప్రపంచం అంతా ఒక ఆర్డర్లోకి రావాలంటే అదే కరెక్టు అన్నాడట. తాను హిట్లర్ను ఫాలోఅవుతున్నట్లు చెప్పాడు. హిట్లర్ బలమైన నేత అన్న విషయాన్ని చెప్పాడు. నాజీ జెండాను ఆన్లైన్లో కొన్నట్లు సాయి వర్షిత్ చెప్పాడని అఫిడవిట్లో పేర్కొన్నారు.
చెస్టర్ఫీల్డ్కు చెందిన సాయి వర్షిత్.. 2022లో మార్క్వీట్ సీనియర్ హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో అతను స్టూడెంట్ కౌన్సిల్లో పాల్గొన్నాడు. కందుల సాయి వర్షిత్ గురించి ఎటువంటి పోలీసు రికార్డు లేదని చెస్టర్ఫీల్డ్ పోలీసు శాఖ తెలిపింది. వైట్హౌజ్పై దాడి చేయాలన్న ఆపరేషన్ ఆర్నెళ్లుగా జరుగుతున్నట్లు సాయి తెలిపాడు. అయితే ట్రక్కు నుంచి ఆయుధాలు కానీ మందుగుండు సామాగ్రి కానీ దొరకలేదు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.