న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: కరోనా కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. భవిష్యత్లో విరుచుకుపడే కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకేనంటూ కొన్ని దేశాల్లో బూస్టర్ డోసు (వ్యాక్సిన్ మూడో డోసు) కూడా ఇస్తున్నారు. భారత్లో కూడా బూస్టర్ డోసును ప్రారంభించాలన్న విజ్ఞప్తులు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత దేశీయ వ్యాక్సినేషన్లో బూస్టర్ డోసును కూడా చేర్చాలా? వద్దా? అనే దానిపై నిపుణులు పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశ జనాభాలో కేవలం 15 శాతం మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారని ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ శాస్త్రవేత్త సత్యజిత్రాత్ అన్నారు. ఇలాంటి సమయంలో బూస్టర్ డోసు ప్రారంభించేకంటే ముందు.. టీకా వేసుకోని వారికి కనీసం ఒక్క డోసు టీకానన్న వేయాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బూస్టర్ డోసు అవసరం లేదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ శాస్త్రవేత్త వినీత బాల్ తెలిపారు.