హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎలర్జీకి చికిత్సను ఇకనుంచి పూర్తి ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎర్రగడ్డ ఛాతి దవాఖానలో ప్రత్యేక క్లినిక్ ఏర్పాటుకు వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. మూడు నాలుగు రోజుల్లో దవాఖాన ఆవరణలో ఎలర్జీ క్లినిక్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేస్తున్నట్టు సూపరింటెండెంట్ మహబూబ్ఖాన్ తెలిపారు. వారంలో ఒకరోజు ఈ క్లినిక్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. రోగులకు ఓపీ సేవలు అందిస్తామని పేర్కొన్నారు. వైద్యుల కన్సల్టేషన్ తరువాత.. రోగి ఎలర్జీకి గల కారణాలు తదితరాలను వైద్యపరీక్షల ద్వారా తెలుసుకుని పూర్తిస్థాయి చికిత్స అందిస్తామని వివరించారు. పెరుగుతున్న ఎలర్జీ బాధితుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఉచితంగా చికిత్స అందించేందుకు వైద్యశాఖ సిద్ధమవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది, మన రాష్ట్రంలో 10 నుంచి 15 శాతం మంది ప్రజలు పలు రకాల ఎలర్జీలతో బాధపడుతున్నట్టు వైద్యులు అంచనా వేస్తున్నారు.