తలాపున గోదావరి ప్రయాణిస్తున్నా.. ఆనాడు తెలంగాణ గొంతు తడవలేదు. దూరదృష్టి కరువవ్వడంతో ఏటా వేల టీఎంసీల నదీజలాలు సముద్రం పాలయ్యేవి. భారీగా వర్షాలు కురిసినప్పుడు గోదావరిఖని సమీపంలోని నది నీటితో కళకళలాడుతూ కనిపించేది. నెల తిరిగేసరికి ఇదిగో ఇలా ఎడారిని తలపించేది. అఖండ గోదావరి అని పుస్తకాల్లో చదువుకోవడమే కానీ, క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా నీటి జాడలేక పంటకాలువ కన్నా హీనంగా దర్శనమిచ్చేది.
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పబలంతో గోదావరి నిండుకుండలా మారింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించిన తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ బరాజ్ నుంచి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి వరకు 190 కిలోమీటర్ల మేర అఖండ గోదావరి సాక్షాత్కరిస్తున్నది. ఈ మొత్తం పొడవులో 50టీఎంసీలకు పైగా నీళ్లు నిల్వ ఉంటాయి. ఏడాదంతా జలసిరి తొణికిసలాడటంతో సమీప గ్రామాల్లో భూగర్భ జలాలు పైపైకి చేరుతున్నాయి.