సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 9: దేశ అత్యున్నత న్యాయస్థానం స్వయంగా రిజర్వేషన్లు ఏ మేరకైనా కల్పించుకోవచ్చని, సమాజం మారుతున్నదని స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉన్న అడ్డంకులేమిటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన బీసీ విద్యార్థి గర్జనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో తగ్గించిన రిజర్వేషన్లను వెంటనే పెంచాలన్నారు. రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని సూచించారు. ఇంకెన్ని రోజులు బీసీలు ఓటు బ్యాంకుగా ఉంటారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
అగ్రవర్ణాల ప్రజలు 5 నుంచి 6 శాతం ఉంటే 10 శాతం రిజర్వేషన్లు కల్పించారని, అందుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తక్కువ జనాభా ఉన్న వారికే ఆ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తే, బీసీ జనాభా ప్రకారం 56 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. 75 ఏండ్లుగా బీసీలను బిచ్చగాళ్లను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో నిర్వహించే జనాభా లెక్కల్లో బీసీ జన గణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు బోనులో నిలబడే రోజు వచ్చిందని, వెంటనే బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్, నాయకులు పట్నం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.