Delhi Liquor Policy | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): మద్యం విక్రయాల విషయంలో ప్రస్తుతం దేశంలో రెండు రకాల విధానాలు అమల్లో ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే వేలంలో పాల్గొని లక్కీ డ్రాలో గెలిచిన ప్రైవేటు వ్యక్తులు.. చట్టపరంగా మద్యాన్ని రిటైల్గా విక్రయించడం ఒకటైతే, ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను నిర్వహించడం రెండోది. ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు మార్చి 2021లో నూతన మద్యం పాలసీకి ఢిల్లీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అనంతరం ఈ పాలసీ అమల్లోకి వచ్చింది. కొత్త మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ లెఫ్ట్నెంట్ గవర్నర్ వినయ్కుమార్ సక్సేనా 2022 జూలై 20న కేంద్రహోంశాఖకు లేఖ రాశారు. దర్యాప్తు చేసిన ఈడీ, సీబీఐ ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతోపాటు పలువురిని అరెస్టు చేశారు. అయితే, ‘ఢిల్లీ మద్యం విధానం’లో అసలు కుంభకోణం ఎక్కడ ఉన్నదని ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టు గత ఏడాది మేలో ఈడీని నిలదీయడం గమనార్హం.