సిద్దిపేట, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వ్యవసాయ నల్ల చట్టాలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని ప్రధాని మోదీని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. నల్ల చట్టాలపై వెంటనే స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవానికి హాజరైన మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు. అమరులైన రైతు కుటుంబాలకు, త్యాగాలతో పోరాటం చేసిన రైతులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన చట్టాలు చాలా మంచివని, ఆ చట్టాలను మరో రూపంలో తీసుకొస్తామని తోమర్ చెప్పడం సరికాదని చెప్పారు. ఏడాది పాటు రైతులంతా పోరాటం చేసి ఆ చట్టాలు రద్దు చేయించుకొంటే, తిరిగి వాటిని తెస్తామని అనటం యావత్తు దేశ రైతులను అవమానించటం, కించపరచటమేనని అన్నారు.
నల్లచట్టాలను మళ్లీ తెస్తే 700 మంది రైతుల ఆత్మ ఘోషిస్తుందని, కించపరిచినట్టు అవుతుందని వ్యాఖ్యానించారు. స్వయంగా ప్రధాని మోదీ నల్ల చట్టాలు రద్దుచేస్తున్నట్టు ప్రకటించడం, తిరిగి ప్రవేశపెడతామని తోమర్ చెప్పటంతో ఎవరి మాట నమ్మాలో తెలియని పరిస్థితి ఉన్నదని అన్నారు. వెంటనే ప్రధాని మోదీ స్పందించి ఈ అయోమయాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. దేశ రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష గట్టిందని, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ర్టాల్లో ఎన్నికల కోసమే నల్ల చట్టాలను రద్దు చేశారేమోనన్న అనుమానం కలుగుతున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని కొమురవెల్లి మల్లన్న దేవుడిని వేడుకొన్నట్టు మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.